తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖపై సమీక్ష నిర్వహించారు. అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. మెగా డీఎస్సీ ద్వారా టీచర్ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలన్నారు. తెలంగాణ వ్యాప్తంగా టీచర్ పోస్టుల భర్తీకి పలు సూచనలు చేశారు. రాష్ట్రంలో బడిలేని పంచాయతీ ఉండకూడదన్నారు.
రాష్ట్రంలోని ప్రతి గ్రామం, తండాలో పాఠశాల ఉండాల్సిందేనని తెలిపారు. బీఆర్ఎస్ సర్కారు పాలనలో మూసివేసిన పాఠశాలలను తెరిపించాలని చెప్పారు. స్టూడెంట్ల సంఖ్యతో సంబంధం లేకుండా బడులు ఉండాలని అన్నారు. విద్య కోసం చిన్నారులు తమ గ్రామం నుంచి ఇతర గ్రామాలకు వెళ్లే పరిస్థితి ఉండకూడదని చెప్పారు.
అలాగే, మన ఊరు-మన బడి కార్యక్రమంలో పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలని అన్నారు. టీచర్ల ప్రమోషన్లు, బదిలీల్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని చెప్పారు. రాష్ట్రంలోని పది ఉమ్మడి జిల్లాల్లో స్కిల్ యూనివర్సిటీలను ఏర్పాటు చేస్తామని అన్నారు. ఇతర రాష్ట్రాల్లో ఉన్న స్కిల్ యూనివర్సిటీలపై అధ్యయనం చేయాలని చెప్పారు. త్వరలో ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు జరపాలన్నారు. కాగా, కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీకి ప్రభుత్వం ప్రత్యేక అధికారికిని నియమించింది.